చింతలపూడి శ్రీనివాసరావుపై నాగసుశీల ఫిర్యాదు

18 Nov, 2017 16:43 IST|Sakshi

అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామి చింతలపూడి శ్రీనివాస్ పై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు విచారణ ప్రారంభించారు. గత 11 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్న నాగసుశీల, శ్రీనివాస్ ల మధ్య ఏడాది కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. తన అనుమతి లేకుండా కంపెనీ ఆస్తులను అమ్ముకున్నారని నాగసుశీల ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. శ్రీనివాస్ భార్యతో పాటు మరో 12 మందిపై నాగసుశీల ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే వీరి వివాదం ఏడాది కాలంగా హైకోర్టులో పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే శ్రీనివాస్ కంపెనీ ఆస్తులను ఇతరులకు రిజిస్టర్ చేయటంతో నాగసుశీల మరోసారి కోర్టును ఆశ్రయించారు. నాగసుశీల, శ్రీనివాస్ లు 12 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఆరు సినిమాలను నిర్మించారు. ఇటీవల తెరకెక్కిన ఆటాడుకుందాం రా సినిమా విషయంలో వివాదం మొదలైనట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై స్పందించిన చింతలపూడి శ్రీనివాస్, నాగ సుశీల కావాలనే తనపై తప్పుడు కంప్లయింట్ ఇచ్చారని ఆరోపించారు. నాగసుశీల తనకు బాకీ పడ్డారని అవి ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని, కంపెనీ ఆస్తులను సొంతం చేసుకునేందుకే ఇలాంటి కంప్లయింట్ లు ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సివిల్ కేసు నడుస్తుండగా ఎలాగైనా ఆ కేసును క్రిమినల్ కేసుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. 

మరిన్ని వార్తలు