హైదరాబాద్ : నవ మన్మధుడు అక్కినేని నాగార్జున, అమల తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వీరిద్దరి వివాహం జరిగి పాతిక సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నాగార్జున ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. నాగార్జున తన పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ ‘నేటితో 25 ఏళ్ళు పూర్తైంది. ఈ కపుల్ కి యానివర్సరీ విషెస్ తెలపండి’ అంటూ కామెంట్ పెట్టారు. అలాగే అమలతో పాటు, తమపై ప్రేమ, అభిమానం చూపిన అందరికి కృతజ్ఞతలు అని నాగ్ తెలిపారు.
1992లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు అక్కినేని అఖిల్ కూడా అమ్మా,నాన్నలతో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. కాగా ప్రస్తుతం నాగ్... రాజుగారి గది-2లో నటిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత చాలాఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమల... శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. మలయాళ చిత్రం ‘కేరాఫ్ సైరాభాను’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.