డిజిటల్‌ ఇండియా మరోకోణం ఇరుంబుతిరై

10 May, 2018 12:13 IST|Sakshi
ఇరుంబుతిరై చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: డిజిటల్‌ ఇండియా మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇరుంబుతిరై చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పీఎస్‌. మిత్రన్‌ పేర్కొన్నారు. విశాల్‌ కథానాయకుడిగా నటించి తన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇరుంబుతిరై. నటి సమంత నాయకిగా నటించిన ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. సుమన్, రోబోశంకర్‌ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్ర నిర్మాణంలో లైకా సంస్థ భాగస్వామ్యం పంచుకుంది. ఇందులో విశాల్‌ ఆర్మీ అధికారిగా నటించగా, నటి సమంత ఆర్మీ సైకియాలజిస్ట్‌గా నటించారు. ఇరుంబుతిరై శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర సగ భాగాన్ని బుధవారం పత్రికల వారికి చిత్ర యూనిట్‌ స్థానిక సత్యం థియేటర్‌లో ప్రదర్శించారు.

ఇలా చిత్ర సగ భాగాన్ని ప్రదర్శించడం అన్నది కొత్త విధానం అవుతుంది. అనంతరం చిత్ర దర్శకుడు పీఎస్‌. మిత్రన్‌ మాట్లాడుతూ ఎప్పుడు కొత్తగా ఆలోచించే నటుడు విశాల్‌ తన ఏదో ఒక చిత్ర సగభాగాన్ని విడుదలకు ముందు పత్రికల వారికి ప్రదర్శించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని భావించారన్నారు. ఇప్పుడు ఇరుంబుతిరై చిత్ర సగభాగా న్ని ప్రదర్శించడానికి అదే కారణం అని పేర్కొన్నారు. చిత్ర రెండవ భాగం జనరంజకంగానే ఉంటుందన్నారు. ఆధార్‌ కార్డు వల్ల కలిగే ముప్పు గురించి ఈ చిత్రం ఉంటుందనే ప్రచారం జరుగుతోందని, నిజా నికి డిజిటల్‌ ఇండియా మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇరుంబుతిరై చిత్రం ఉంటుందని చెప్పారు.  చిత్ర సగభాగాన్ని ముందుగా పత్రికల వారికి ప్రదర్శించడంలో తమ కెలాంటి భయం లేదని, ఒక కొత్త ప్రక్రియకు నాంది పలకాలన్నదే దీని ముఖ్యోద్దేశం అని అన్నారు. ఈ సమావేశంలో లైకా సంస్థకు చెందిన కరుణ, ఆయుబ్‌ఖాన్, ఎడిటర్‌ రూపన్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు