జీవాతో రొమాన్స్‌కు నిక్కీ సై

27 Jun, 2016 03:48 IST|Sakshi
జీవాతో రొమాన్స్‌కు నిక్కీ సై

మధ్య స్థాయి కథానాయకులకు లక్కీ నాయకిగా మారిన నటి నిక్కీగల్రాణి అని చెప్పవచ్చు. డార్లింగ్ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత యాగవరాయన్ నాకాక్క చిత్రాల్లో నటించారు. ఇటీవల విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేసిన వేల్లైన్ను వందుట్టా వెల్లైక్కారన్ చిత్రం అనూహ్య విజయంతో అమ్మడి క్రేజ్ అదే స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం నాలుగు చిత్రాల వరకూ చేతిలో ఉన్నాయి. మరిన్ని కొత్త అవకాశాలు నిక్కీ కోసం ఎదురు చూస్తున్నాయి.విజయ్, అజిత్, విక్రమ్ వంటి స్టార్ హీరోల తరువాత స్థాయిలో రాణిస్తున్న జీవా, జీవీ.ప్రకాశ్, విక్రమ్‌ప్రభు లాంటి హీరోలకు నిక్కీగల్రాణి లక్కీ హీరోయిన్‌గా మారారని చెప్పవచ్చు.

ప్రస్తుతం లారెన్స్ సరసన మొట్టశివ కెట్టశివ, జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాల్లో నటిస్తున్న నిక్కీగల్రాణి త్వరలో విక్రమ్‌ప్రభుకు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా మరో అవకాశం నిక్కీని వరించింది. నటుడు జీవాతో డ్యూయెట్లు పాడే చాన్స్‌ను దక్కించుకుంది. నిజానికి కవలై వేండామ్ చిత్రంలోనే జీవాతో నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం మిస్ అయ్యింది. అందులో నటి కాజల్‌అగర్వాల్ నటిస్తున్నారు. జీవా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు.

ఈ చిత్రానికి కీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నిక్కీగల్రాణి ఆయనకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు కాళీష్ దర్శకత్వం వహించనున్నారు. ఆర్‌జే.బాలాజీ ముఖ్య పాత్రను పోషించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నట్లు సమాచారం.