నలుగురూ స్నేహితులే!

24 Sep, 2016 00:29 IST|Sakshi
నలుగురూ స్నేహితులే!

 నటనలో, అందంలో ఈ నలుగురూ నలుగురే. సుమారు ముప్ఫై ఏళ్లుగా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా సినిమాలు చేశారు. అప్పట్లో అగ్ర హీరోయిన్లు ఎవరు?  అనడిగితే... ఊర్వశి, రాధిక, ఖుష్బూ,  సుహాసిని.. ఈ నలుగురి పేర్లూ తప్పకుండా వినిపించేవి. వీళ్ల మధ్య పోటీ సినిమాల వరకే. మేకప్ తీసేసిన తర్వాత నలుగురూ స్నేహితులే. హెల్దీ కాంపిటీషన్ అనమాట. ఎయిటీస్ రీ-యూనియన్ పేరుతో ప్రతి ఏడాది గెట్ టుగెదర్ పార్టీలు నిర్వహిస్తుంటారు.
 
 ఇప్పుడీ నలుగురి గురించి ప్రస్తావన ఎందుకంటే... వీళ్లంతా కలసి ఓ సినిమాలో నటించనున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. నలుగురు సీనియర్ హీరోయిన్లు ఓ సినిమాలో నటించడం వింతేముంది? అనుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే.. ఈ నలుగురూ కలసి నటిస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఇంకొకటి.. నిజ జీవితంలో స్నేహితులైన వీళ్లు సినిమాలోనూ స్నేహితులుగానే నటించనున్నారు.
 
 జేమ్స్ వసంతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా హిందీ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తరహాలో ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందట. ఈ నలుగురి క్యారెక్టరైజేషన్‌లను 90వ దశకంలో వాళ్లు నటించిన హిట్ సినిమాల్లోని క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్‌తో డిజైన్ చేశారట. వచ్చే వారమే ఆస్ట్రేలియాలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ అంతా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రియల్ లైఫ్‌లో ఈ నలుగురూ స్నేహితులు కావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.