తమిళ తంబీలు ఖుష్!

5 Jun, 2016 03:00 IST|Sakshi
తమిళ తంబీలు ఖుష్!

అది ఎగ్మోర్. చెన్నైలో ఉన్న ఫేమస్ ఏరియాల్లో అదొకటి. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. గత వారం రోజుల్లో ఆ సందడి రెట్టింపయింది. దానికి కారణం మన చిన్న ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం షూటింగ్ ఎగ్మోర్‌లోని మెమోరియల్‌లో జరిగింది. అక్కడ షూటింగ్ జరుగుతోందని తెలిసి, చుట్టుపక్కల జనాలు గుమిగూడిపోయారట. అదేం పెద్ద విశేషం కాదు. షూటింగ్ అంటే ఆ హడావిడి ఉంటుంది.

కానీ, ఎన్టీఆర్‌ని చూడ్డానికి ఏకంగా క్యూలో నిలబడటం విశేషం. గంటలు గంటలు క్యూలో నిలబడి, ఎన్టీఆర్‌ని కలిసిన తర్వాతే వెళ్లారట. ఒక తెలుగు హీరోకి పొరుగు రాష్ట్రంలో ఆ స్థాయి ఆదరణ అంటే మామూలు విషయం కాదు. గత నెల 27న చెన్నైలో షూటింగ్ మొదలైంది. దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ చేశారు. ఆ వారం రోజులూ భారీగా జనాలు వచ్చేవారని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రహ్మాజీ అన్నారు.

వీలు చేసుకుని ఎన్టీఆర్ ఆటోగ్రాఫులూ, ఫొటోగ్రాఫులూ ఇచ్చి, తమిళ తంబీలను ఖుష్ చేశారట. అఫ్‌కోర్స్ తంగచ్చీ (చెల్లెళ్లు)లు, అక్కలకు కూడా ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్‌లిచ్చి, ఫొటోలు దిగారనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ లుక్‌కి మంచి స్పందన లభించింది. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.