గోవుల మధ్య గోపాలుడిలా..!

8 Jul, 2016 02:29 IST|Sakshi
గోవుల మధ్య గోపాలుడిలా..!

ఖాళీ సమయాల్లో పవన్ కల్యాణ్ ఏం చేసినా చేయకపోయినా నచ్చిన పుస్తకాలు చదువుతారు. లేకపోతే తన ఫామ్‌హౌస్‌కి వెళ్లి పలుగూ, పారా పట్టుకుని పొలం పని చేస్తారు. వాస్తవానికి పవన్‌కి నగర జీవితానికి దూరంగా అలా ఫామ్‌హౌస్‌లో గడపడం చాలా ఇష్టం. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఫామ్‌మౌస్‌లోనే ఉన్నారు. పచ్చని చెట్ల మధ్య సేద తీరుతూ ఫామ్‌హౌస్‌లో ఉన్న ఆవుల సంరక్షణను పరిశీలించుకుంటున్నారు.


అందుకే నిర్మాత శరత్ మరార్ ‘గోవుల మధ్య గోపాలుడి’లా పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారని అంటున్నారు. ఇంతకీ శరత్ మరార్ ఫామ్‌హౌస్‌కి ఎందుకు వెళ్లారంటే.. పవన్ కల్యాణ్ నటించనున్న తాజా చిత్రానికి ఆయనే నిర్మాత అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి చర్చించడానికే శరత్ మరార్ వెళ్లారు. ఎస్.జె. సూర్య తప్పుకున్నాక దర్శకత్వ బాధ్యతలను డాలీ స్వీకరించారు. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ఈ చిత్రం ఆగిందనే వార్త హల్‌చల్ చేసింది. కానీ, రచయిత ఆకుల శివ, డాలీ తదితరులు స్టోరీ డిస్కషన్స్‌లో ఉన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం ఆరంభమయ్యే అవకాశం ఉంది.