పవన్‌-త్రివిక్రమ్‌ కాంబోలో మరో చిత్రం?

12 Jun, 2020 20:12 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో నాలుగో సినిమా రాబోతుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్‌ వర్గాలు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాల్లో రెండు సూపర్‌డూపర్‌ హిట్‌ కాగా మరొకటి బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయాలని పవన్‌ ఆమితాసక్తిని కనబరుస్తున్నారట. కాగా ఈ మధ్య పవన్‌కు త్రివిక్రమ్‌ ఓ కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. అంతేకాకుండా వీలైనంత త్వరగా పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని తీసేలా ప్లాన్‌ చేయాలని త్రివిక్రమ్‌కు పవన్‌ సూచించారని సమాచారం. 

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చేస్తున్న పవన్, ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ చిత్రం చేయనున్నారు. హరీష్‌ శంకర్‌తో ఓ సినిమాకు కూడా పవన్‌ కమిట్‌ అయ్యారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా క్రిష్‌ సినిమాకు సంబంధించి భారీ సెట్‌ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయట. దీంతో ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. క్రిష్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభంకావడానికి ముందు వచ్చే ఈ చిన్న గ్యాప్‌లో త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని పవన్‌ భావిస్తున్నాడట. (మరో రికార్డు క్రియేట్‌ చేసిన ‘అఆ’)

మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్‌ వెయిట్ చేస్తున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పూర్తయితే గానీ ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ల సినిమా పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ క్రమంలో నాని, వెంకటేష్‌లతో మల్టీస్టారర్‌ చిత్రానికి ప్లాన్‌ చేసినప్పటికీ అది ఇప్పట్లో వర్కౌట్‌ అయ్యేలా కనిపించడం లేదు. దీంతో త్వరలోనే పవన్‌-త్రివిక్రమ్‌ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.  (హరీశ్‌ మరో చిత్రం.. పవన్‌ ఫ్యాన్స్‌కు డౌట్‌)

మరిన్ని వార్తలు