ఇటలీ ఇక్కడే!

15 Apr, 2020 09:16 IST|Sakshi

ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జార్జియా షెడ్యూల్‌ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. యూరప్‌ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ షూటింగ్‌ కొంత భాగం ఇటలీలో జరగాల్సి ఉంది. ఆల్రెడీ ఈ సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటలీలో చిత్రీకరించారు. 

కానీ ఇటలీలో ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. పైగా కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా ఆయా ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ తర్వాత ఇటలీ షెడ్యూల్‌ కొనసాగించాలన్నా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సరిగ్గా సమకూరుతాయా? లేదా అనే సందేహం చిత్రబృందంలో ఉందట. అందుకని ఇటలీ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే జరపాలనుకుంటున్నారట. ఈ సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ ఇటలీ లొకేషన్స్‌కు సంబంధించిన డిజైన్స్, సెట్‌ వర్క్‌ వంటివాటిపై ఇప్పటికే దృష్టి సారించారని తెలిసింది. లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్‌లోనే ఇటలీ సెట్‌ వేసి, చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు