విలన్‌ పాత్రకి ఎవరి స్ఫూర్తీ లేదు – ప్రభుదేవా

10 Apr, 2018 00:48 IST|Sakshi
కార్తికేయన్‌, ప్రభుదేవా, కార్తీక్‌ సుబ్బరాజ్‌,

‘‘ఎంటర్‌టైనింగ్, మాస్‌ అంశాలతో తెరకెక్కిన మంచి చిత్రం ‘మెర్క్యురి’. నా కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఫిలింగా ఉంటుంది. విలన్‌గా చేయడం ఎగ్జయిట్‌మెంట్‌ అనిపించింది. ఆ పాత్ర చేయడానికి ఎవరి స్ఫూర్తీ లేదు. కార్తీక్‌ సుబ్బరాజ్‌పై నమ్మకంతోనే చేశా. సినిమా చూస్తున్నంత సేపు పాత్రలు మాత్రమే కనపడతాయి’’ అని ప్రభుదేవా అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెర్క్యురి’. పెన్‌ స్టూడియోస్, స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ సమర్పణలో కార్తికేయన్‌ సంతానం, జయంతి లాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 13న విడుదలవుతోంది.

తెలుగులో కె.ఎఫ్‌.సి. ప్రొడక్షన్‌ విడుదల చేస్తున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్తికేయన్‌ సంతానం మాట్లాడుతూ– ‘‘యూనిక్‌ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. కమల్‌హాసన్‌గారి ‘పుష్పకవిమానం’ తర్వాత వస్తోన్న మూకీ సినిమా ‘మెర్క్యురి’. కమర్షియల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది. ఇండియన్‌ సినిమాను తర్వాతి లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘పిజ్జా’ తెలుగులోనూ మంచి హిట్‌ అయింది. ‘మెర్క్యురి’ లాంటి వైవిధ్యమైన సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇందులో పాటలు, డ్యాన్సులు ఉండవు’’ అన్నారు కార్తీక్‌ సుబ్బరాజ్‌.

మరిన్ని వార్తలు