నెలాఖరున ‘60 వయదు మానిరం’

19 Aug, 2018 07:00 IST|Sakshi

తమిళసినిమా: కిళక్కు సీమయిలే చిత్రం తరువాత మనసును అంతగా హత్తుకున్న చిత్రం 60 వయదు మానిరం అని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌.థాను పేర్కొన్నారు. వీ క్రియేషన్స్‌ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి పబ్లిసిటీ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈయన ఇటీవల రజనీకాంత్‌ హీరోగా కబాలి చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్‌ప్రభు, ప్రకాశ్‌రాజ్, సముద్రకని నటి ఇందుజా ప్రధాన పాత్రల్లో రాధామోహన్‌ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 60 వయదు మానిరం.

చాలా సైలెంట్‌గా చిత్రీకరణను, నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమానుబంధాలను ఆవిష్కరించే ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రామన్నారు. దీనికి సంగీతజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టడం విశేషం. సెన్సార్‌ కార్యక్రమాలను ఇటీవలే పూర్తి చేసుకుంది.

చిత్రం చూసిన సెన్సార్‌ సభ్యులు చాలా మంచి సినిమా అంటూ ప్రశంసల జల్లు కురిపంచి యూ సర్టిఫికెట్‌ను అందించారట. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌.థాను తన ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన కిళక్కు సీమయిలే చిత్రం తరువాత అంతగా నా మనసును హత్తుకున్న చిత్రం 60 వయదు మానిరం అన్నారు. చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ నటనకు అవార్డు రావడం ఖాయం అని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు