పొంగల్‌కు పేట్ట

25 Nov, 2018 09:47 IST|Sakshi

ఈ నెలాఖరు నుంచి రజనీకాంత్‌ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఆయన అభిమానులకు పండగలే పండగలు. రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ప్రకటన గురించి ఏమోగానీ, ఆయన సినీ అభిమానులకు మాత్రం ఇక ఖుషీనే. సూపర్‌స్టార్‌ నటించిన కాలా చిత్రం కాస్త నిరాశ పరచినా, దాన్ని మరపించేందుకు వరసుగా రెండు భారీ చిత్రాలు తెరపైకి వచ్చి పండగ వాతావరణాన్ని తీసుకురానున్నాయి.

రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో భారీ, బ్రహ్మాండ చిత్రం 2.ఓ ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్‌ నటించిన మరో చిత్రం పేట్ట కూడా వెనువెంటనే తెరపై సందడి చేయనుంది. యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ తెరకెక్కించిన ఇందులో రజనీకాంత్‌కు జంటగా నటి త్రిష, సిమ్రాన్‌ నటించారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను యమ స్పీడ్‌గా జరుపుకుంటోంది.  ఈ చిత్ర సింగిల్‌ ట్రాక్‌ను డిసెంబర్‌ 3న, రెండో సింగిల్‌ట్రాక్‌ పాటను అదే నెల 7న విడుదల చేయనున్నారు. ఇక చిత్ర ఆడియోను రజనీకాంత్‌ పుట్టినరోజు పురస్కరించుకుని డిసెంబర్‌ 9న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పేట్ట చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుందని ఇంతకు ముందే చిత్ర వర్గాలు వెల్లడించినా, ఆ తరువాత చిత్రం వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. పేట్ట చిత్ర విడుదల పొంగల్‌కు ఖాయం అని తాజాగా చిత్ర దర్శకుడు స్పష్టం చేశారు. 2.ఓ విజువల్స్‌ ట్వీట్‌ అయితే పేట్ట రజనీ స్టైల్స్‌ ట్వీట్‌గా ఉంటుంది. దీంతో రజనీకాంత్‌ అభిమానులకు ఈ నెల 29 నుంచి పొంగల్‌ వరకూ పండగే పండగన్న మాట.

మరిన్ని వార్తలు