రాజ్ తరుణ్ రిస్క్ చేస్తున్నాడా..?

3 Nov, 2015 09:07 IST|Sakshi
రాజ్ తరుణ్ రిస్క్ చేస్తున్నాడా..?

'ఉయ్యాలా జంపాల', 'సినిమా చూపిస్తా మామ' లాంటి వరుస సూపర్ హిట్స్తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్ తరుణ్. షార్ట్ ఫిలింస్ చేసిన అనుభవంతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చి అనుకోకుండా నటుడు అయిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం  అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే తన జనరేషన్లో కాంపిటేషన్ ఎక్కువగా ఉందని ఫీల్ అవుతున్నాడేమో, రిస్కీ ప్రాజెక్ట్స్ను అంగీకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ప్రస్తుతం సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాతగా తెరకెక్కిస్తున్న 'కుమారి 21ఎఫ్' సినిమాను పూర్తి చేసిన రాజ్తరుణ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాలు పూర్తి కాగానే రామ్ గోపాల్వర్మ దర్శకత్వంలో మూకీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో వర్మ దర్శకత్వంలో నటించటమే రిస్క్ ...అలాంటిది మూకీ సినిమా చేయటం అంటే సాహసమే.

'రేయ్' సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన వైవియస్ చౌదరి దర్శకత్వంలోనూ రాజ్తరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ యిచ్చాడు.  చాలా కాలంగా కెరీర్లో సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న చౌదరి 'రేయ్' సినిమా తరువాత ఇండస్ట్రీలో ఎవరికి కనిపించటం లేదు. ఈ గ్యాప్ లో ఓ యూత్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి రాజ్ తరుణ్తో ఓకె చేసుకున్నాడు. ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్న చౌదరికి రాజ్తరుణ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.