అవకాశాలు తగ్గాయా?

12 Oct, 2019 11:55 IST|Sakshi

సినిమా: ఫ్లాప్‌ల కారణంగా తనకు అవకాశాలు తగ్గాయనే ప్రచారం చేస్తున్నారని నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కించిత్‌ ఆవేదనను వ్యక్తం చేసింది. నిజం చెప్పాలాంటే టాలీవుడ్‌లో ఒక రౌండ్‌ కొట్టేసిన ఈ అమ్మడికి అక్కడిప్పుడు అవకాశాలు లేవు. అదేవిధంగా కోలీవుడ్‌లోనూ ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం మినహా హిట్స్‌ను అందుకోలేకపోయింది. అంతే కాదు ఈ మధ్య ఆ జాణ నటించిన చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఉండడం లేదన్నది వాస్తవమే. అందాలారబోతకే పరిమితం అవుతోందనే విమర్శలను మూటకట్టుకుంటోంది. అయితే సూర్యకు జంటగా నటించిన ఎన్‌జీకే చిత్రం నిరాశపరిచినా ఇక్కడ శంకర్‌ దర్శకత్వంలో విశ్వనటుడు కమలహాసన్‌తో నటించే అవకాశాన్ని చేజిక్కించుకోవడం విశేషమే. ఇక శివకార్తికేయన్‌తో ఒక చిత్రం కమిట్‌ అయ్యింది.

అయినా ఈ అమ్మడు తనకు అవకాశాలు తగ్గాయన్న విషయాన్ని అంగీకరించడం లేదు. దీని గురించి రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించే చిత్రాల సంఖ్య తగ్గిందని, వరుస ఫ్లాప్‌ల కారణంగానే కొత్త చిత్రాల అవకాశాలు రావడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని అంది. నిజం చెప్పాలంటే తాను నటిగా పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ అంతస్తును అందుకున్నానంది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించడం వల్లే ఫ్లాప్‌లను ఎదుర్కోవలసిన పరిస్థితి అని చెప్పింది. ఇకపోతే హిందీలో పలు అవకాశాలు రావడంతో దక్షిణాదిలో అవకాశాలను అంగీకరించలేకపోతున్నట్లు తెలిపింది.

అంతేకానీ తనకు అవకాశాలు రాక కాదని పేర్కొంది. అయినా తనకు మంచి భవిష్యత్‌ ఉందని అంది. ఇప్పుడు కథలను ఎంపిక చేసుకోవడంలో పరిపక్వత, పరిణితి వచ్చిందని చెప్పింది. ఏదో నాలుగు పాటల్లో ఆడి, రెండు మూడు సన్నివేశాల్లో కనిపించే పాత్రల్లో నటించడం తనకు ఇష్టం లేదని చెప్పింది. మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్నానంది. తమిళ, తెలుగు భాషల్లో ప్రముఖ నటులతో నటించానని, కమలహాసన్‌ వంటి ప్రముఖ నటుడితో కలిసి నటించే అవకాశం ఇంతత్వరగా వస్తుందని ఊహించలేదని అంది. ఇకపోతే హిందీలో రన్వీర్‌సింగ్, తెలుగులో విజయ్‌దేవరకొండలతో జతకట్టాలన్న కోరిక ఉందని చెప్పింది. అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు