ఈశ్వర్‌,అల్లా,జీసస్‌లపై ఒట్టేసిన వర్మ

27 May, 2020 09:17 IST|Sakshi

భారత్‌లో తొలి కరోనా కేసు నమోదైన క్షణం నుంచి తనదైన శైలిలో కవితలు, పాటలు రాశాడు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. అయితే తాజాగా యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఏకంగా ఓ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ మూవీని లాక్‌డౌన్‌ సమయంలో చిత్రీకరించడం విశేషం. తాజాగా ‘కరోనా వైరస్‌’ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

ఈ ట్రైలర్‌ కొన్ని గంటల వ్యవధిల్లోనే 1.5 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిపై వర్మ స్పందించాడు. ‘ఈశ్వర్‌, అల్లా, జీసస్‌ మరియు ప్రభుత్వంపై ఒట్టేసి చెబుతున్నా లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడే మేము ‘కరోనా వైరస్‌’ చిత్ర షూటింగ్‌ జరిపాం. చిత్రయూనిట్‌ పక్కాగా లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించింది’ అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. 

‘ఇదిగో కరోనా వైరస్‌ చిత్ర ట్రైలర్‌. లాక్‌డౌన్‌ సమయంలో కథ తయారు చేశాం. లాక్‌డౌన్‌ సమయంలో చిత్రీకరించాం. ఎందుకంటే మా పనిని దేవుడైనా, కరోనానైనా ఏదీ ఆపలేదు. కరోనా మనందరిలోనూ ఉన్న భయం. ఆ భయం వ్యాధి, చావును జయించడానికి ప్రేమకున్న శక్తిని నిరూపించే పరీక్ష ఇది’ అంటూ ట్రైలర్‌ విడుదల చేస్తూ వర్మ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. 

చదవండి:
సెన్సార్‌ పూర్తి.. సస్పెన్స్‌ అలానే ఉంది!
నటుడు సూర్యకు గాయాలు..!

మరిన్ని వార్తలు