సినిమా సినిమాకీ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు రానా. ‘గృహం’ వంటి హారర్ థ్రిల్లర్తో సూపర్హిట్ అందుకున్నారు దర్శకుడు మలింద్ రౌ. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. రజనీకాంత్ ‘బాషా’ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి, తెలుగులో ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడటానికి కారణమైన విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్పై గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ ఆచంట మాట్లాడుతూ– ‘‘బాషా’ సినిమాతో తెలుగుసినిమా ఇండస్ట్రీకి విశ్వశాంతి పిక్చర్స్ పరిచయమైంది. చాలా గ్యాప్ తర్వాత మా బ్యానర్లో నయనతార హిట్ చిత్రం ‘ఇమైక్కా నొడిగల్’ ను ‘అంజలి సిబిఐ’ గా విడుదల చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా తెలుగుసినిమాలను నిర్మించబోతున్నాం. అందులో భాగంగా రానాగారితో సినిమా చేయబోతున్నాం. ఆగస్ట్ నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.