రణ్‌బీర్‌తో రైలు ప్రయాణం!

22 Nov, 2015 23:54 IST|Sakshi
రణ్‌బీర్‌తో రైలు ప్రయాణం!

ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రచార కార్యక్రమాలతో సందడి చేస్తున్న జంటల్లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనేల జంట ఒకటి. ఈ మాజీ లవర్స్ నటించిన తాజా చిత్రం ‘తమాషా’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. ఫ్లయిట్ టికెట్స్ బుక్ అయిపోయాయి. దీపికా మాత్రం ముంబయ్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్‌లో వెళితే బాగుండు అనుకున్నారట.

ఈ విషయం రణ్‌బీర్‌కి తెలిసిపోయింది. అంతే.. ఫ్లయిట్ టికెట్స్ క్యాన్సిల్ చేయించేసి, ట్రైన్ టికెట్స్ బుక్ చేయించేశారు. దీపికా హ్యాపీగా ట్రైన్ ఎక్కి, ‘అండ్ ది జర్నీ బిగిన్స్’ అని ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది. దీపికా ఇష్టపడితే రణ్‌బీర్ ఎందుకు తీర్చాలి? ఈ విషయంలో ఆయన తాజా ప్రేయసి కత్రినా కైఫ్‌కి కోపం వచ్చే అవకాశం ఉందేమో అని పరిశీలకులు అంటున్నారు. పాయింటే కదా!