బిల్డర్‌తో వివాదం.. ప్రధాని సాయం కోరిన నటి

17 Dec, 2018 13:35 IST|Sakshi

తన భర్త నివాసానికి సంబంధించిన ఓ వివాదం విషయమై ప్రధాని నరేం‍ద్ర మోదీ సాయాన్ని అర్థించాలని భావిస్తున్నారు అలనాటి బాలీవుడ్‌ నటి సైరాబాను. వివరాలు.. ముంబై బాంద్రా ఏరియాలో నటుడు దిలీప్‌ కుమార్‌కు విలాసవంతమైన భవనం ఉంది. అయితే  సమీర్‌ భోజ్వానీ అనే బిల్డర్‌ నకిలీ పత్రాలతో సదరు బిల్డింగ్‌ను ఆ‍క్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సైరాబాను ఆరోపించారు. గతంలో ఇదే విషయమై సదరు బిల్డర్‌ మీద సైరాబాను జనవరిలో కేసు పెట్టారు. ముంబయి పోలీసు విభాగానికి చెందిన ఆర్ధిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యు) అతడిపై కేసు నమోదు చేసింది. అంతకు ముందే అతడి నివాసంపై దాడులు నిర్వహించి కత్తులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకోవడమే కాక ఈ ఏడాది ఏప్రిల్‌లో అతన్ని అరెస్టు చేసింది.

అయితే సదరు బిల్డర్‌ జైలు నుంచి విడుదల కావడంతో మళ్లీ తన ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తాడని భావించిన సైరాబాను.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. దాంతో తన భర్త దిలీప్‌కుమార్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా ‘ల్యాండ్‌ మాఫియా సమీర్‌ భోజ్వానీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతని మీద సీఎం ఫడ్నవీస్‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డబ్బు, బలంతో అతను బెదిరిస్తున్నాడు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. భోజ్వానీ కొన్ని కీలకపత్రాలను ఫోర్జరీ చేయడం ద్వారా నాటి నటుడు దిలీప్‌కుమార్‌ బంగ్లాను చేజిక్కించుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు