‘జాను’ టీజర్‌ ఎప్పుడొస్తుందంటే?

8 Jan, 2020 19:27 IST|Sakshi

శర్వానంద్‌, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాను’. సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌ లుక్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను చిత్ర బృందం అభిమానులకు తెలిపింది. ఈ మూవీ టీజర్‌ను రేపు(గురువారం) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సమంత లుక్‌ను ఇప్పటివరకు రివీల్‌ చేయకపోవడంపై ఆమె ఫ్యాన్స్‌ కాస్త నిరుత్సాహపడుతున్నారు. అయితే రేపు విడుదలయ్యే టీజర్‌లో సమంత లుక్‌ ఎలా ఉండబోతుందో చూడటానికి ఆమె ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

త్రిష, విజయ్ సేతుపతి జంటగా తమిళంలో వచ్చిన సినిమా ‘96’ . భాషతో సంబంధలేకుండా కేవలం భావాలతోనే అర్థం చేసుకునే ఉండటంతో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రేక్షకకులను తెగ ఆకట్టుకుంది. అంతేకాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. హృదయాలను తాకే సన్నివేశాలతో పాటు పాటలు, బాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఈ సినిమా కట్టిపడేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజుకు ఈ సినిమా బాగా నచ్చడంతో తెలుగులో నిర్మిస్తున్నారు. ఇక ‘96’ కు దర్వకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులోనూ డైరెక్ట్‌ చేస్తున్నాడు. 

ఇక ఈ మధ్యకాలంలో కథతో పాటు తన పాత్రా ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు సమంత. అందులో భాగంగానే యూటర్న్‌, మజిలీ, ఓ బేబి వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక సినిమాలతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లలో కూడా సమంత నటించేందుకు సిద్దంగా ఉన్నారు. మరోవైపు శర్వానంద్‌ ‘రణరంగం’ ఫలితం తర్వాత కాస్త నిరుత్సాహపడ్డాడు. అయితే ఈ సినిమాపై శర్వా భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు ఈ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో శర్వానంద్‌. ఇప్పటికే షూటింగ్‌ తుది దశకు చేరుకున్న ‘జాను’ చిత్రం వచ్చే నెల ప్రారంభంలో విడుదల కానుంది. గోవింద్‌ వసంత్‌ సంగీతమందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు