తగ్గని జోష్‌.. ‘సరిలేరు’కు భారీ వసూళ్లు!

13 Jan, 2020 12:36 IST|Sakshi

హైదరాబాద్‌: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజామూవీ ‘సరిలేరు నీకెవ్వరు’  బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓపెనింగ్స్‌ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్‌ను దాటేసే అవకాశముందని అంటున్నారు. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు చేరువగా వచ్చిందని అంటున్నారు. అధికారిక లెక్కలు వస్తే.. తొలి మూడురోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్క్‌ను దాటిందా? లేదా? అన్నది తెలిసే అవకాశముంది. 

మరోవైపు ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కుతుండటంతో రోజుకొక ప్రొమో, ప్రమోషన్‌ వీడియలతో ఈ చిత్రయూనిట్‌ హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ‘బ్లాక్‌బస్టర్‌కా బాప్‌’ ప్రొమో వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై దర్శకుడు అనిల్‌ బాగా ఫోకస్‌ చేశాడని రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో బాక్సాఫీస్‌ వద్ద ‘సరిలేరు నీకెవ్వరు’ భారీగానే వసూళ్లు రాబట్టినట్టు ట్రెడ్‌ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

Poll
Loading...
మరిన్ని వార్తలు