ఆ తప్పు ఇక్కడ చేయను: సాయేషా

16 Jun, 2017 20:09 IST|Sakshi
ఆ తప్పు ఇక్కడ చేయను: సాయేషా

'అఖిల్' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్  అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది‌. మొదట టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట.. ఇప్పుడు కోలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకునేది లేదని ఆమె కరాఖండిగా చెబుతోంది. లెజెండ్రీ నటుడు దిలీప్‌కుమార్‌ కుటుంబం నుంచి వచ్చిన సాయేషా టాలీవుడ్‌ను ఎంచుకుని అఖిల్‌ చిత్రంతో తెరంగేట్రం చేసింది.

అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఆమె ప్రతిభ వెలుగులోకి రాలేదు. తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్‌ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఓకే అనిపించుకోవడంతో ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తలుపు తట్టాయట. ఈ రెండు భాషా చిత్రాల అనుభవాన్ని చవిచూసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కోలీవుడ్‌లో అడుగు పెట్టింది.

ఇక్కడ జయం రవికి జంటగా వనయుద్ధం చిత్రంలో నటించింది. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో హీరోకు చాలా తక్కువ మాటలు, సాయేషాకు ఎక్కువ మాటలు ఉంటాయట. అంతేకాక ఇందులో పాటల సన్నివేశాల్లో డ్యాన్స్‌లో సాయేషా కుమ్మేసిందట.

అంతేకాకుండా ఆ పాట కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన డ్యాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవానే అబ్బురపడేలా డ్యాన్స్‌ చేసిందట. ఈ టాక్‌ కోలీవుడ్‌లో వైరల్‌ అవడంతో అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీ స్టార్‌ చిత్రం కరుప్పు రాజా వెళ్లై రాజా చిత్రంలో నటించడానికి ఎంపికైంది. మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇలా కోలీవుడ్‌లో అనూహ్యంగా అవకాశాలు తలుపు తడుతుండటంతో అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది సాయేషా.