డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్న లా ట్రోబ్‌ యూనివర్సిటీ

16 Jul, 2019 14:23 IST|Sakshi

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌కు చెందిన లా ట్రోబ్‌ యూనివర్సిటీ షారుక్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా వెలుగొందుతున్న షారక్‌.. మహిళలు, పిల్లల కోసం ‘మీర్‌’ అనే సంస్థను స్థాపించి.. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షారుక్‌ కృషిని అభినందిస్తూ..  ‘డాక్టర్‌ ఆప్‌ లెటర్స్‌’ను ప్రదానం చేయనున్నట్లు సదరు యూనివర్సిటీ ప్రకటించింది. త్వరలో మెల్‌బోర్న్‌లో జరగనున్న ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ వేడుకలకు షారుఖ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

డాక్టరేట్‌పై షారుక్‌ స్పందిస్తూ.. 'లా ట్రోబ్‌ అనేది ప్రముఖ యూనివర్సిటీ. చాలా కాలంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో సంబంధాలు కొనసాగిస్తుంది. మహిళా సమానత్వం కోసం కృషి చేస్తోంది. అటువంటి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందడం గౌరవంగా భావిస్తున్నా. నా పేరును సూచించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా' అని పేర్కొన్నారు. వచ్చే నెల 9న బుందూరలోని మెల్‌బోర్న్‌ క్యాంపస్‌లో షారుక్‌కు ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేస్తారు.

మరిన్ని వార్తలు