పద్మావతి పాటలు మొదలయ్యాయి

11 Jul, 2016 18:51 IST|Sakshi
పద్మావతి పాటలు మొదలయ్యాయి

సంజయ్ లీలా భన్సాలీ అంటే బాలీవుడ్లో రాజమౌళి లాంటి దర్శకుడు. ఆయనేం తీసినా అదో దృశ్యకావ్యం లాగే ఉంటుంది. దేవదాసు, రామ్లీలా, బాజీరావు మస్తానీ.. ఇలా చెప్పుకొంటూ పోతే అన్నీ అద్భుతాలే. తాజాగా ఆయన తీస్తున్న మరో భారీ చిత్రం.. పద్మావతి. ఆ సినిమా పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో కూడా మళ్లీ బాజీరావు హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ ఈ సినిమాలో పాటలు పాడుతోంది. దీనికోసం భన్సాలీ ఒక పాట కంపోజ్ చేశారట. ఆ పాట తన కెరీర్లోనే ఓ పెద్ద మైలురాయిలా మిగిలిపోతుందని శ్రేయా చెబుతోంది.

‘‘నా జీవితంలోనే మైలురాయి లాంటి పాటను రికార్డు చేశాను. ఇది మనసుకు పూర్తిగా సంతృప్తినిచ్చే అద్భుతమైన పాట. ఇలాంటి పాటల కోసమే జీవిస్తున్నానా అనిపిస్తోంది. పద్మావతి సినిమా కోసం సంజయ్ లీలా భన్సాలీ అత్యద్భుతమైన కంపోజిషన్స్ ఇచ్చారు. గుండె లోతుల్లోంచి ఈ పాట పాడాను’’ అని శ్రేయా ఘోషల్ చెప్పింది. బాజీరావు మస్తానీ సినిమాలోని ‘దీవానీ మస్తానీ’ పాటకు గాను ఆమెకు బోలెడన్ని అవార్డులు వచ్చి పడ్డాయి. బాజీరావు మస్తానీ సినిమాను భన్సాలీ నిర్మించడంతో పాటు దానికి సంగీతం కూడా ఆయనే అందించారు.