సినిమా: పార్టీ ఎక్కడుంటే అక్కడ నటి త్రిష ఉంటుందనే టాక్ కోలీవుడ్లో ఉంది. ఇక నటుడు శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలనాలకు కేంద్ర బిందువు ఆయన. అలాంటి శింబు చాలా కాలం తరువాత సెక్క సివందవానం చిత్ర విజయంతో ఫామ్లోకి వచ్చాడు. ఇక సుందర్.సీ దర్శకత్వంలో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబుతోంది. ఇలా శింబు మంచి జోష్లో ఉన్న తరుణంలో నూతన సంవత్సరం రావడంతో ఈ అకేషన్ను ఆయన తన అత్యంత సన్నిహితులతో సెలబ్రేషన్ చేసుకున్నారు. శింబు పార్టీ అంటే చెన్నై చిన్నది పాల్గొనకుండా ఉంటుందా? అసలే హిట్ పెయిర్.
ఇంకా చిరకాల మిత్రులు. ఇదిలాఉండగా శింబు, త్రిష జంటగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రం వీరిద్దకి కేరీర్లోనూ ఒక మైలురాయిగా నిలిచే చిత్రం. కాగా నూతన సంవత్సరం సందర్భంగా నటుడు శింబు చెన్నైలోని తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో నటి త్రిషతో పాటు సోనియాఅగర్వాల్, మేఘాఆకాశ్, గాయత్రి రఘురాం, నటుడు శాంతను భార్య కీర్తీ, నటుడు కార్తీ, మహత్, దర్శకుడు సుందర్.సీ, వెంకట్ప్రభు తదితరులు పాల్గొన్నారు. కాగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో కార్తీ, శింబు వ్యతిరేక వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఆ తరువాత వీరిద్దరూ పాత విషయాలను మరచిపోయి మంచి మిత్రులైపోయారు.