కాబోయే అత్తకు విందిచ్చిన నయన

18 Oct, 2016 02:43 IST|Sakshi
కాబోయే అత్తకు విందిచ్చిన నయన

 కోడలికి పేరు, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా అత్తమామలకు మర్యాదలు చేయాల్సిందే. ఇది సనాతన సంప్రదాయం. ఇక ప్రియుడు ఎంత ప్రేమించినా ఆయన అమ్మ అనుమతి లభిస్తేనే ఆ జంట భవిష్యత్ బంగారుబాటగా మారుతుంది. ఈ విషయాన్ని నటి నయనతార గ్రహించినట్లున్నారు. తనకు కాబోయే అత్తగారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పడ్డారని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. విషయంలోకి వెళితే సంచలన తారగా వాసికెక్కిన నయనతార శింబు, ప్రభుదేవాల తరువాత తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.
 
 నానూ రౌడీదాన్ చిత్రం షూటింగ్ సమయంలోనే ఆ దర్శక నటిల మధ్య ప్రేమ చిగురించిందన్నది ప్రచారంలో ఉంది. ఏ కార్యక్రమానికైనా నయనతార, విఘ్నేశ్‌శివ కలిసి హాజరవుతూ వార్తల్లోకెక్కుతున్నారు. అంతే కాదు అలాంటి కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత సంచలనం కలిగిస్తుండడం విశేషం. కాగా వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనే ప్రచారం జరుగుతోంది.దీన్ని ధ్రువపరచే విధంగా ఇటీవల ఒక సంఘటన జరిగినట్లు సమాచారం. దర్శకుడు విఘ్నేశ్‌శివ తల్లిదండ్రులిద్దరూ పోలీస్ అధికారులుగా పని చేశారట. ముఖ్యంగా ఆయన తల్లి రౌడీలకు స్వప్నసింహంగా ఉండేవారట.
 
 ఎంద రో రౌడీల ఆటకట్టించిన ఆమె గురించి తెలిసి నయనతారే కంగుతిన్నారట. అలాంటిది ఎట్టకేలకు తను ప్రియుడు తల్లిని పరిచయం చేయడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందని సమాచారం. దాన్ని మరింత పెంచుకోవడానికి నయనతార ఇటీవల విఘ్నేశ్‌శివ తల్లిని తన ఇంటికి ఆహ్వానించి మంచి విందునిచ్చారని ప్రచారం జరుగుతోంది. నయన్ స్వయంగా తానే వంట చేసి కాబోయే అత్తకు వడ్డించారట. ఇదే ఇప్పుడు మీడియాలో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారిన అంశం. మొత్తం మీద అత్త కోసం నయనతార వంటింటి బాట పట్టారన్న మాట.