‘క్యాన్సర్‌ అని తెలియగానే సైకియాట్రిస్ట్‌ను కలిశాను’

2 Mar, 2019 14:44 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రె క్యాన్సర్‌ బాధితురాలనే సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు సోనాలి. వైద్యంతో పాటు చికిత్స సమయంలో ఆమె చూపిన ధైర్యం కూడా వ్యాధి నుంచి త్వరగా కొలుకోవడానికి దోహదం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తనకు క్యాన్సర్‌ సోకిందని తెలియగానే ముందుగా సైకియాట్రిస్ట్‌ను కలిశానన్నారు సోనాలీ. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ కార్యక్రమానికి హాజరయిన సోనాలీ ఈ విషయం గురించి ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు క్యాన్సర్‌ అని తెలిసినప్పుడు అందరూ నీ జీవిన విధానం చాలా బాగుంటుంది కదా ఇది ఎలా సాధ్యమయ్యిందంటూ ప్రశ్నించారు. కానీ నా మనసులో మాత్రం క్యాన్సర్‌ రావడానికి నేనే కారణం అనే ఫీలింగ్‌ ఉండేది. అందుకే చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్లినప్పుడు ముందుగా ఓ సైకియాట్రిస్ట్‌ను కలిశాను. అతనితో ‘నాకు ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. నేను చాలా సానుకూల దృక్పథంతో ఉంటాను. అలాంటిది నాకు క్యాన్సర్‌ రావడం ఏంటి. ఒక వేళ నా సబ్‌కాన్షియస్‌లో నేను నెగిటీవ్‌గా ఆలోచిస్తున్నానా.. లేక నేను భ్రాంతిలో ఉన్నానా. అసలు నాలో ఏం జరుగతుందో నాకు తెలియాలి’ అంటూ ఆ సైక్రియాట్రిస్ట్‌ను ప్రశ్నించాను’ అని తెలిపారు సోనాలీ.

అప్పుడు ఆ సైకియాట్రిస్ట్‌ చెప్పిన సమాధానం తనకు జీవితం మీద కొత్త ఆశలు కల్పించిందన్నారు సోనాలీ. అతను ‘క్యాన్సర్‌ అనేది వైరస్‌ వల్ల, జెనటిక్‌ కారణాల వల్ల వస్తుంది. ఒక వేళ ఆలోచలే క్యాన్సర్‌ కల్గిస్తాయి, నయం చేయగల్గుతాయనుకుంటే.. ఈ ప్రపంచంలో నాకంటే ధనవంతుడు ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రతిరోజు నేను మనుషుల ఆలోచనలతో డీల్‌ చేస్తుంటాను అని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న తర్వాత నన్ను నేను నిందించుకోవడం మానేశాను. ధైర్యంగా క్యాన్సర్‌తో పొరాడాను’ అంటూ చెప్పుకొచ్చారు. క్యాన్సర్‌ చికిత్స నిమిత్తం న్యూయార్క్‌ వెళ్లిన సోనాలీ గత ఏడాది డిసెంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చారు.

మరిన్ని వార్తలు