మాటలంటే మాకు ఇష్టం

21 Aug, 2018 00:26 IST|Sakshi

సినిమా

ఇద్దరు ఫ్రెండ్స్‌ ఒక దగ్గర చేరితే ఏం మాట్లాడుకుంటారు? ‘ఎన్నెన్ని మాట్లాడుకుంటారో!’ అనాలి కదా. వాళ్లిద్దరూ ఒకే దగ్గర పని చేస్తూ ఉంటే? తాప్సీని అడిగి చూస్తే ఏం చెప్తున్నారో తెల్సా – ‘ఇష్టమైన మాటలు’ అని! తాప్సీ, కనిక ధిల్లన్‌ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌. వీరిద్దరూ ఇంకా సూర్యుడు ఉదయించకముందే అమృత్‌సర్‌లోని పచ్చని పొలాల్లో ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తాప్సీ హీరోయిన్‌గా నటించిన‘మన్‌ మర్జియాన్‌’ సినిమాకు కనిక స్క్రీన్‌ప్లే, డైలాగ్‌ రాశారు. ఆ సమయంలోనే ఇద్దరూ ఇలా ఫ్రెండ్స్‌ అయిపోయారు. 

సెప్టెంబర్‌ 14న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి కానీ, అందులో తాను చేసిన రూమీ పాత్ర గురించి కానీ, ఇంకా కెరీర్‌కు సంబంధించిన ఇంకే విషయంగానీ మాట్లాడుకోవట్లేదట ఇద్దరూ. ‘సాయంత్రం డిన్నర్‌ ఎక్కడ చేద్దాం’, ‘సాయంత్రం సరే, ముందు బ్రేక్‌ఫాస్ట్‌ ఏం చేద్దాం’, ‘అమృత్‌సర్‌లో కుల్చ ఫేమస్‌ కదా, అది ట్రై చేద్దామా’.. ఇవి.. ఈ ఫొటో తీస్తున్న టైమ్‌కి అచ్చంగా ఈ మాటలు మాట్లాడుకుంటున్నారట తాప్సీ, కనిక. ఫ్రెండ్స్‌ అంటే మరి అన్నీ మాట్లాడుకుంటారు. సరదావి, సీరియస్‌వి కూడా! అవి ఏవైనా ఇష్టమైన మాటలు అంటున్నారు తాప్సీ. ఈ ఫ్రెండ్స్‌ ‘మన్‌ మర్జియాన్‌’తో పెద్ద హిట్‌ కొట్టాలని కోరుకుందాం. 

మరిన్ని వార్తలు