సాక్షి, సినిమా : సీనియర్ నటి టబు గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగ్-వర్మ కొత్త చిత్రానికి హీరోయిన్గా కన్ఫర్మ్ అయ్యిందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందన్నది ఓ వార్త కాగా, ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రం కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారన్నది మరో వార్త సారాంశం.
ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రాలపై ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబు స్పందించారు. ఇండియా టుడే వెలువరించిన కథనం ప్రకారం.. గత కొన్నేళ్లుగా ఆమె సినిమా-సినిమాకు ఆమె 8 నెలల నుంచి ఏడాది గ్యాప్ తీసుకుంటున్నారు. ఆ లెక్కన కొత్తగా తాను ఏ సినిమాకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఇంత వరకు ఏ మేకర్లు తనని సంప్రదించలేదని.. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. అయితే తన కొత్త చిత్రం మాత్రం వచ్చే ఏడాదిలోనే ఉంటుందని ఆమె ప్రకటించారు.
ఆ లెక్కన నాగ్, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆమె నటించబోతుందన్న వార్త నిజం కాదని స్పష్టమయ్యింది. ఇక అజయ్ దేవగన్ హీరోగా ఆమె నటించిన గోల్మాల్ రిటర్న్స్ దీపావళికి రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రూ. 182 కోట్ల కలెక్షన్లతో ఈ ఏడాది బాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్గా ఆ చిత్రం నిలిచింది.