థాంక్యూ ట్వింకిల్‌.. మరి అక్షయ్‌ సంగతేంటి : తనుశ్రీ

29 Sep, 2018 15:59 IST|Sakshi

పదేళ్ల క్రితం ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’  చిత్ర సమయంలో మొదలైన నానా పటేకర్‌ వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తనుశ్రీ దత్తా టీమ్‌ ఆరోపించింది. తనుశ్రీకి మద్దతుగా మాట్లాడుతున్న వ్యక్తులను, మీడియా హౌజ్‌ ప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు పటేకర్‌ లాయర్‌ ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే విధంగా లీగల్‌ నోటీసులు ఇచ్చి, తనుశ్రీని కోర్టు కీడుస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. కాగా నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులు ట్వింకిల్‌ ఖన్నా, సోనమ్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌, ఫర్హాన్‌ అక్తర్‌, ప్రియాంక చోప్రా తదితరులు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. (చదవండి : 'నానా'గొడవ)

థ్యాంక్యూ ట్వింకిల్‌.. కానీ
‘పని చేసే చోట వేధింపులు, బెదిరింపులు లేకుండా ఉండాలని కోరుకోవడం అందరి హక్కు. అలాంటివాటి గురించి ఇలాంటి (తనుశ్రీ) ధైర్యవంతులు బహిరంగంగా మాట్లాడటం ఇతరులకూ ఆదర్శం’  అంటూ ట్వింకిల్‌ ఖన్నా ట్వీట్‌ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన ట్వింకిల్‌కు కృతఙ్ఞతలు చెప్పిన తనుశ్రీ... ‘మీరు నా పక్షాన నిలిచినందుకు సంతోషం. కానీ మీ భర్త అక్షయ్‌ కుమార్‌ సంగతేంటి. ఆయన ఎన్నో ఏళ్లుగా నానా పటేకర్‌తో కలిసి నటిస్తున్నారు. అంతెందుకు ప్రస్తుతం హౌజ్‌ఫుల్‌ 4 సినిమాలో కూడా నానాతో స్క్రీన్ షేర్‌ చేసుకుంటున్నారు కదా. దీనికి మీ సమాధానం ఏమిటంటూ’ ప్రశ్నించారు. అదేవిధంగా కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ తీరు కూడా తనని బాధించిందని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక స్త్రీగా తను(ఫరాఖాన్‌) నా బాధ అర్థం చేసుకుంటుంది అనుకున్నా కానీ.. ఈ సమయంలో నానా పటేకర్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ తనుశ్రీ ప్రశ్నించారు. (తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన నానా పటేకర్‌)

>
మరిన్ని వార్తలు