మరో ఏడాది థియేటర్లు ఉండవు

17 Jul, 2020 01:06 IST|Sakshi

∙స్టార్‌ సిస్టమ్‌ ఇక నశించినట్లే

‘‘మరో ఏడాది వరకూ థియేటర్లు రీ ఓపెన్‌ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మొదటివారం మా సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిందనే టాక్‌ ఇక వినిపించనట్లే. ‘స్టార్‌ సిస్టమ్‌’ (స్టార్‌ హీరోలను ఉద్దేశించి) ఇక నశించినట్లే’’ అని బాలీవుడ్‌ ప్రముఖ దర్శక–నిర్మాత–నటుడు శేఖర్‌ కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘2020 మార్చి నుండి సినిమాల మొదటి వారం వ్యాపారం గురించి ఊసే లేదు. మరో ఏడాది వరకు సినిమాలు థియేటర్లో విడుదలయ్యే పరిస్థితి లేదు.

అసలు ఆ అవకాశం కనుచూపు మేరలో లేదు. అందుకే స్టార్స్‌ తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసుకోవడానికి రెడీ అయిపోవాలి. సొంత యాప్‌లతో వాళ్లు సిద్ధంగా ఉండాలి. ఇవాళ టెక్నాలజీ అంతా మన చేతుల్లోనే ఉంది’’ అని కూడా అన్నారు శేఖర్‌ కపూర్‌. ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌ (‘లక్ష్మీ బాంబ్‌’), అజయ్‌ దేవగన్‌ (భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా) వంటి స్టార్స్‌ చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో శేఖర్‌ కపూర్‌ అన్నట్లు భవిష్యత్తులో సినిమా బాక్సాఫీస్‌ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లను చూసే అవకాశం లేదా? కాలమే చెప్పాలి.

మరిన్ని వార్తలు