అందరూ మహిళలే...

13 Jan, 2019 00:34 IST|Sakshi
నదియా

‘మిర్చి, అత్తారింటికి దారేది, దృశ్యం’ వంటి సినిమాల్లో పవర్‌ఫుల్‌ పాత్రలు చేసి గ్రాండ్‌ రీ–ఏంట్రీ ఇచ్చారు నదియా. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘తిరైక్కు వరాద కథై’. తులసీ దాస్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘దేవి’ పేరుతో అనువాదమైంది. కె.కె.ఆర్‌. క్రియేషన్స్‌ పతాకంపై కె. ప్రియభారతి సమర్పణలో కర్రి సత్యనారాయణరెడ్డి, కె. కృష్ణ, సబ్బిళ్ళ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘ఓ మర్డర్‌ మిస్టరీని ఛేదించే స్పెషల్‌ సి.బి.ఐ అధికారిగా నదియా అద్భుతంగా నటించారు.

కొందరు సాంకేతిక నిపుణులు మినహా మిగతా అందరూ మహిళలే పని చేసిన చిత్రం ఇది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌తో స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. తమిళంలో హిట్‌ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో మేము అనువదించాం. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. ఈ నెలాఖర్లో చిత్రాన్ని విడుదల చేయ డానికి ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. కోవై సరళ, ఇనియా, శోభికా మోహన్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎం.జి. శ్రీకుమార్‌ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు