టైటానిక్‌ని అవెంజర్స్ ముంచింది: జేమ్స్‌ కామెరూన్‌

9 May, 2019 14:52 IST|Sakshi

'అవెంజర్స్‌' సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ ఉందో అందరికి తెలిసిందే. మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రమైన ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ ప్రపంచం వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదలై వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. అవెంజర్స్‌ ఎండ్‌గేమ్ వసూళ్లపై దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ ట్విటర్‌లో వెరైటీగా స్పందించారు. టైటానిక్ చిత్రంలో ఐస్‌బర్గ్‌ షిప్‌ను ముంచేస్తే, వసూళ్లలో అవెంజర్స్‌ టైటానిక్‌ని ముంచినట్టు ఉన్న ఓ ఫోటోను పోస్ట్‌ చేశారు. మార్వెల్‌ సంస్థ అధినేత కెవిన్‌, వారి టీమ్‌ సభ్యులను పనితీరును కొనియాడారు. 'నిజ‌మైన టైటానిక్‌ని ఓ ఐస్‌బ‌ర్గ్ ముంచేస్తే, నా టైటానిక్‌ని మీ అవెంజ‌ర్స్ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్ స్టార్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరూ మీరు సాధించిన విజ‌యానికి సెల్యూట్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ బతికుండటం కాదు చాలా గొప్పగా ఉందని మీరు ప్రూవ్ చేశారు' అని జేమ్స్ ట్వీట్‌ చేశారు.

కాగా, 2009లో జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. అడియన్స్‌ ఇంట్రెస్ట్‌కు తగ్గట్లే ‘అవతార్‌ 2,3,4,5’ సీక్వెల్స్‌ తెరకెక్కిస్తున్నారు జేమ్స్‌ కామెరూన్‌. తొలుత ‘అవతార్‌ 2’ చిత్రాన్ని 18 డిసెంబరు 2020న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ 17 డిసెంబరు 2021లో విడుదల చేయనున్నట్లు తాజాగా జేమ్స్‌ కామెరూన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు