త్రిషకు మరో రెండు..

22 Dec, 2018 07:14 IST|Sakshi

సినిమా: ఏ రంగంలోనైనా విజయాలే కెరీర్‌ను నిర్ణయిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజం చెప్పాలంటే ఈ చెన్నై చిన్నది త్రిష విజయాన్ని చూసి చాలా కాలమైంది. స్టార్‌ హీరోలతో నటించిన చిత్రాలే కాదు, ఎన్నో ఆశలు నింపుకుని నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు నాయకి, మోహిని వంటి చిత్రాలు ఈ అమ్మడిని తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక టాలీవుడ్‌ ఈ బ్యూటీని దాదాపు మరిచిపోయిందనే చెప్పాలి. అలా విజయం కోసం తహతహలాడుతున్న సమయంలో వచ్చిన చిత్రం 96. ఎలాంటి అంచనాలు లేకుండా తెరపైకి వచ్చిన ఈ చిత్రం త్రిషకు ఊహించని విజయాన్ని అందించిపెట్టింది. అంతే త్రిష పేరు మరోసారి కోలీవుడ్‌లో మారుమోగింది. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేని పాత్రలో త్రిష అభినయం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

అంతే అవకాశాలు ఇప్పుడామె ఇంటి తలుపులు తడుతున్నాయి. జీవా, శాలినిపాండే జంటగా నటిస్తున్న గొరిల్లా చిత్ర నిర్మాణ సంస్థ తదుపరి త్రిష హీరోయిన్‌గా వరుసగా రెండు చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్రిష హీరోయిన్‌గా వరుసగా చిత్రాలు చేయనుండడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. రజనీకాంత్‌కు జంటగా ఈ సంచలన నటి నటించిన పేట చిత్రం 2019 సంవత్సరానికి స్వాగతం పలికే విధంగా సంక్రాంతికి తెరపైకి రానుంది. ఇప్పుడామె గర్జన, చతురంగవేట్టై 2, 1818, పరమపదం విళయాట్టు చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో కొన్ని చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. 35 వసంతాల ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం చాలా అవకాశాలు వస్తున్నా, కథ, కథా పాత్రలు నచ్చితేనే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు, అలాం టి పాత్రలనే అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. మొత్తం మీద 2018 త్రిష జీవితంలో మరచిపోలేని సంవత్సరంగా గుర్తుండిపోతుంది.

మరిన్ని వార్తలు