‘‘ప్రేమ, వినోదం, థ్రిల్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన చిత్రం ‘మాధవే మధుసూదన’. మంచి కథ. తెలుగులో ఓ కొత్త జానర్లా అనిపిస్తుంది’’ అన్నారు తేజ్ బొమ్మ దేవర. ఆయన హీరోగా, రిషికా లోక్రే హీరోయిన్గా నటించిన చిత్రం ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ రేపు(నవంబర్ 24) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా తేజ్ బొమ్మదేవర మాట్లాడుతూ– ‘‘బీబీఏ పూర్తి చేసి, విదేశాలకు వెళ్లి ఎంబీఏ చేద్దామనుకున్నా. అయితే కరోనా వల్ల ఆగిపోయాను. మా నాన్న రామచంద్ర రావు ఆ సమయంలో ‘మాధవే..’ కథను రెడీ చేసుకున్నారు. భిక్షు మాస్టర్ వద్ద నటనలో శిక్షణ తీసుకుని, ఈ సినిమా చేశాను. హీరోలు వేదికలపై మాట్లాడుతూ అప్పుడప్పుడు తడబడుతుంటే ఏదో అనుకునేవాణ్ని. కానీ వారి కష్టం ఎలా ఉంటుందో నాకు అర్థం అయింది. హీరోగానే కాదు.. ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తాను’’ అన్నారు.