-

ప్రేక్షకుల హృదయాల్ని కబ్జా చేస్తాం

5 Jan, 2020 02:12 IST|Sakshi

– ఉపేంద్ర

‘‘ఏ’ చిత్రం నుంచి ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా వరకూ తెలుగు ప్రేక్షకులు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చేస్తున్న ఈ ‘కబ్జా’లో 1940–80 మధ్య కాలంలో అండర్‌ వరల్ద్‌ ప్రపంచాన్ని చూపించనున్నాం’’ అన్నారు ఉపేంద్ర. ఆయన హీరోగా ఆర్‌. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కబ్జా’. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్‌ సమర్పణలో  ఆర్‌. చంద్రశేఖర్, రాజ్‌ ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత, నిర్మాత రమేష్‌ ప్రసాద్‌ క్లాప్‌ ఇవ్వగా, ఆనంద్‌ గురూజీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బి. గోపాల్‌ తొలి సన్నివేశాన్ని డైరెక్ట్‌ చేశారు. ఉపేంద్ర మాట్లాడుతూ – ‘‘అప్పట్లో ‘ఓం’తో ఓ ప్రయోగం చేశాం. ‘కబ్జా’ చిత్రం కూడా ఓ ప్రయోగమే. చంద్రుతో ‘బ్రహ్మ, ఐ లవ్‌ యూ’ సినిమాలు చేశాను. ఈ సినిమాతో ప్రేక్షకుల హృదయాల్ని కబ్జా చేస్తాం’’ అన్నారు.

‘‘ఈ సినిమాలో భాగం అవ్వడం చాలా సంతోషం. చంద్రుతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా చేశాను’’ అన్నారు లగడపాటి శ్రీధర్‌. ‘‘సరికొత్త స్టయిల్లో ప్యాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు ఆర్‌. చంద్రు. ‘‘ఉపేంద్రగారితో సినిమా చేయాలని పదేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. చంద్రు చెప్పిన కథ నచ్చింది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం’’ అన్నారు రాజ్‌ ప్రభాకర్‌. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత గోనుగుంట్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.     
 

మరిన్ని వార్తలు