వాళ్లిద్దరి ప్రేమ

2 Nov, 2019 03:06 IST|Sakshi
వీఎన్‌ ఆదిత్య, విరాజ్‌ అశ్విన్, నేహాకృష్ణ, అర్జున్‌ దాస్యన్, ఆర్‌.ఆర్‌. కొలంచి

‘మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట’ వంటి హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన వి.ఎన్‌. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. విరాజ్‌ అశ్విన్, నేహాకృష్ణ జంటగా నటిస్తున్నారు. వేదాంశ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై అర్జున్‌ దాస్యన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘వాళ్ళిద్దరి మధ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్‌. ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఇద్దరు ప్రతినాయకులలాంటి హీరో హీరోయిన్‌ మధ్య జరిగే ప్రేమకథ ఇది. సీనియర్‌ ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌గారి మేనల్లుడు విరాజ్‌ అశ్విన్‌ ఈ కథకు హీరోగా కరెక్టుగా సరిపోయాడు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ అమెరికా నుంచి వస్తుంది కాబట్టి సహజత్వానికి దగ్గరగా ఉండేలా కథానాయికని అమెరికా నుంచే పిలిపించాం. కెమెరామన్‌ పి.జి. విందా దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన ఆర్‌.ఆర్‌. కోలంచిని ఈ చిత్రం ద్వారా కెమెరామన్‌గా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందీ చిత్రం. డిసెంబర్‌ మొదటి వారంలోపు చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు అర్జున్‌ దాస్యన్‌. ‘‘నా రెండవ చిత్రం ఆదిత్యగారితో చేయడం చాలా సంతోషంగా ఉంది. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు విరాజ్‌ అశ్విన్‌. ‘తెలుగు చిత్రాల్లో నటించాలనుకుని ఆదిత్యగారిని సంప్రదించా.  ఆయన సినిమాలోనే హీరోయిన్‌గా ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’’ అన్నారు నేహా చిత్ర. ఈ చిత్రానికి సంగీతం: మధు స్రవంతి, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రావణ్‌ నిడమానూరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సూరపనేని కిషోర్‌.

మరిన్ని వార్తలు