యాక్షన్‌ థ్రిల్లర్‌

22 May, 2019 00:00 IST|Sakshi

విభిన్నమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే హీరోల్లో విక్రమ్‌ ఒకరు. కెరీర్లో ఇప్పటికే ఎన్నో యాక్షన్‌ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన మరో యాక్షన్‌ చిత్రానికి పచ్చజెండా ఊపారు. ‘డిమాంట్‌ కాలనీ, ఇమైక్క నొడిగల్‌’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అజయ్‌ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 7 స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్‌ కుమారి నిర్మిస్తారు. వయాకామ్‌ 18 సంస్థ ఈ చిత్రానికి సహ–నిర్మాతగా వ్యవహరించనుంది.

ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే కమల్‌హాసన్‌ ప్రొడక్షన్‌లో విక్రమ్‌ హీరోగా రూపొందిన ‘కడరమ్‌ కొండాన్‌’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇందులో కమల్‌ రెండో కుమార్తె అక్షరా హాసన్‌ కథానాయిక. ఈ సినిమా కాకుండా ‘మహావీర్‌ కర్ణ, ధృవనక్షత్రం’ సినిమాలతో బిజీగా ఉన్నారు విక్రమ్‌. 

మరిన్ని వార్తలు