రేపు ‘చ దురంగ వేట్టై’ మొదలు

17 Jul, 2014 01:15 IST|Sakshi
రేపు ‘చ దురంగ వేట్టై’ మొదలు

రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో చదురంగ వేట్టై మొదలవుతోంది. సీనియర్ హాస్యనటుడు దర్శకుడు మనోబాల నిర్మించిన చిత్రం చదురంగ వేట్టై. నటరాజ్, ఇషారా నాయక్ జంటగా నటించిన ఈ చిత్రానికి వినోద్ దర్శకుడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ అధినేతలు దర్శకుడు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ విడుదల చేస్తున్నారు. చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ఇటీవల తమ సంస్థ ద్వారా విడుదలైన గోలీసోడా, మంజాపై చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయన్నారు.

ప్రస్తుతం సూర్య, సమంత హీరో హీరోయిన్లుగా అంజాన్ చిత్ర నిర్మాణంలో బిజీగా ఉన్నానని చెప్పారు. దీంతో ప్రస్తుతానికి ఇతర చిత్రాలను విడుదల చేయరాదని భావించానన్నారు. అయితే కొందరి ఒత్తిడి మేరకు చదురంగ వేట్టై చిత్రం చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పని ఒత్తిడి కారణంగా అర్ధ నిద్రతోనే చూడటానికి సిద్ధమయ్యానని చెప్పారు. అయితే చిత్రం చూస్తుంటే నిద్రమత్తు వదలిపోయిందన్నారు. అంత ఆసక్తిగా చిత్రం సాగటంతో వెంటనే చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కుంకి, వళక్కు ఎన్ 18/9 చిత్రం మాదిరిగా ఈ చిత్రం తిరుపతి బ్రదర్స్ సంస్థలో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు.  నటీనటులందరూ చక్కగా నటించారని చదురంగ వేట్టై ఖచ్చితంగా జనరంజకంగా ఉంటుందని లింగుస్వామి పేర్కొన్నారు.