థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ

17 Jul, 2018 00:33 IST|Sakshi
‘సత్యం’రాజేశ్, నందిత, అశుతోష్‌ రాణా, రాజ్‌కిరణ్, మాధవి

నందితా రాజ్, ‘సత్యం’ రాజేశ్, అశుతోష్‌ రాణా, ప్రసన్న కుమార్, విద్యుల్లేఖా రామన్‌ ముఖ్య తారలుగా రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, ఎస్‌. రజనీకాంత్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను విడుదల చేసిన నటుడు అశుతోష్‌ రాణా మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్‌ ఉంది. ఈ సినిమాలో నేను పొసెసివ్‌ భర్త పాత్రలో నటిస్తున్నాను. రాజ్‌కిరణ్‌ చక్కగా తెరకెక్కిస్తున్నారు. సినిమా పెద్ద హిట్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు.

‘‘హారర్, కామెడీ జానర్‌ సినిమాలకు నాంది పలికిన రాజ్‌కిరణ్‌గారి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు బీవీఎస్‌ రవి. ‘‘ప్రస్తుతం హారర్, థ్రిల్లర్‌ జానర్‌లదే హవా. యూఎస్, స్విట్జర్లాండ్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటి సిట్టింగ్‌లోనే సినిమా ఓకే చేసిన నిర్మాతలకు థ్యాంక్స్‌. ‘సత్యం’ రాజేశ్‌ని హీరోగా సెలెక్ట్‌ చేసుకున్నాను. కొంతమంది హీరోయిన్స్‌ను సంప్రదించినప్పుడు ‘సత్యం’ రాజేశ్‌ హీరో అని చెప్పగానే కొందరు డ్రాప్‌ అయ్యారు.

సినిమాలో నటించడానికి ఒప్పుకున్న నందితా రాజ్‌కు థ్యాంక్స్‌. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. ‘‘ఏడాదిన్నర క్రితం రాజ్‌కిరణ్‌గారు ఓ పాయింట్‌ చెప్పారు. బాగుంది. కథ పరంగా నాది హీరో క్యారెక్టర్‌ కాదు. అశుతోష్‌ రాణాగారు, మల్లికగారు, మాధవిగారు నాకన్నా ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్‌. ‘‘ఇదొక థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ. ఇప్పటివరకు తెలుగులో రాని కథాంశంతో రూపొందిస్తున్నాం’’ అన్నారు మాధవి.

మరిన్ని వార్తలు