మరుదనాయగమ్ ఎప్పటికైనా తీస్తా!

12 Jun, 2014 00:50 IST|Sakshi
మరుదనాయగమ్ ఎప్పటికైనా తీస్తా!

 ‘‘గత ఇరవయ్యేళ్లలో జరగనిది ఈ ఏడాది జరగనుంది. నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ 20 ఏళ్లల్లో ఇలా జరగలేదు’’ అని కమల్‌హాసన్ చెప్పారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. అలాగే, రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ చిత్రం కూడా పూర్తి కావచ్చిందట. ఈ సినిమాల గురించే కమల్ ఈ విధంగా పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక తన పాఠకులకు కమల్‌ను ప్రశ్నించే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఓ పాఠకుడు ‘మరుదనాయగమ్’ని మధ్యలో ఆపేశారు..
 
  మళ్లీ మొదలుపెడతారా? అని అడిగాడు... దానికి కమల్ సమాధానం చెబుతూ -‘‘అది నాక్కూడా తెలియదు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించాల్సిన సినిమా. నాకు తెలిసి లోకల్ నిర్మాతల నుంచి భారీ బడ్జెట్ పొందే అవకాశం లేదు. ఎందుకంటే, ఇది లోకల్ మూవీ కాదు. తమిళ్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించాల్సిన సినిమా. ఈ చిత్రాన్ని ఆపేయలేదు. ఎప్పుడు ఆరంభమైనా ఆశ్చర్యపోవడానికి లేదు’’ అన్నారు. ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో ప్రారంభించారు కమల్. దాదాపు 25 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా అర్ధంతరంగా ఆపేశారు. మరి.. ‘మరుదనాయగమ్’ మళ్లీ ఎప్పుడు షూటింగ్ పట్టాలెక్కుతాడో వేచి చూడాల్సిందే.