హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ ముంబైలో సందడి చేస్తున్నారు. తను హీరోగా నటించిన బ్రైట్ సినిమా డిసెంబర్ 22న భారత్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విల్ స్మిత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్ తో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో తనకున్న స్నేహం గురించి వెల్లడించారు.
తనకు అక్షయ్ కుమార్ తో సమయం గడపటం చాలా ఇష్టమన్న విల్ స్మిత్, భారత్ లో తనకు నచ్చిన విషయం అక్షయ్ ఇంట్లో భోజనమే అన్నారు. భారతీయ చరిత్ర అంటే తనకు చాలా ఇష్టమని.. భగవద్గీతను 90 శాతం చదివానని తెలిపారు. త్వరలో రిషికేశ్ కు వెళ్లనున్నట్టుగా తెలిపారు విల్ స్మిత్. స్మిత్ తో పాటు మరో హాలీవుడ్ నటుడు జోయెల్ ఎడ్గార్టెన్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.