సరిగ్గా ఇదే రోజు.. ముంబై ఉలిక్కిపడింది

12 Mar, 2018 20:02 IST|Sakshi
బాంబు దాడి తర్వాత దృశ్యం (పాత ఫొటో)

సాక్షి, ముంబై : సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో బాంబుల మోత మోగింది. ఒకటి కాదు రెందు కాదు వరుసగా 12 బాంబు పేలుళ్లతో ముంబై వణికిపోయింది. అన్యం పుణ్యం ఎరుగని 257 మందిని బలితీసుకుంటూ.. 700 మందికి పైగా గాయపర్చిన ఆ మారణహోమానికి నేటితో పాతికేళ్లు నిండాయి. 1993 మార్చి 12న ముంబై నగరంలో ముష్కర మూకలు నరమేధం సృష్టించాయి. దీనికి అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మూల కారకుడని పోలీసులు నిర్ధారించారు. బాబ్రీ మసీదు కుల్చివేతకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్‌డీఎక్స్‌ను ఉపయోగించిన దాడి ఇదే.

అయితే ఈ దాడులకు సంబంధించి టాడా కోర్టు 2007లో తొలి దశ విచారణ చేపట్టింది. అబూసలెం, ముస్తాఫా, కరిముల్లా ఖాన్‌, ఫిరోజ్‌ అబ్దుల్‌ రషీద్‌ ఖాన్‌, రియాజ్‌ సిద్ధిఖీ, తాహిర్‌ మర్చంట్‌, అబ్దుల్‌ ఖయ్యుంలను కీలక నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ తర్వాత అబ్దుల్‌ ఖయ్యుంను నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. మళ్లీ 2012లో కేసు విచారించి ప్రధాన నిందితుడు యాకుబ్‌ మెమెన్‌కు 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2015 జులై 30న యాకుబ్‌ను ఉరితీశారు.

బ్లాస్టింగ్స్‌ జరిగిన ప్రదేశాలు
మహిమ్‌ మార్గంలోని మత్స్యకారుల కాలనీ
జవేరి బజార్‌
ప్లాజా సినిమా
సెంచరీ బజార్‌
కథా బజార్‌
హోటల్‌ సీ రాక్‌
సహార్‌ విమానాశ్రయం (ప్రస్తుత ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం)
ఎయిర్‌ ఇండియా భవనం 
హోటల్‌ జుహు సెంటౌర్‌
వర్లి
బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ భవనం 
పాస్‌ పోర్ట్‌ కార్యాలయం
మసీదు-మండవి కార్పొరేషన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌

>
మరిన్ని వార్తలు