లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పీఏలంటూ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలీగంజ్లోని కపూర్తలా ప్రాంతానికి చెందిన అతీష్కుమార్ మిశ్రా, హనుమాన్ శుక్లా, రాహుల్ ఉపాధ్యాయ అనే ముగ్గురు యూపీ సీఎం పేరుతో తప్పుడు ధ్రువీకరణలతో సిమ్ కార్డు పొందారు.
సీఎం పర్సనల్ అసిస్టెంట్లమంటూ ఆ ప్రాంతంలోని భవన నిర్మాణ యజమానులతోపాటు మరికొందరిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాము అడిగినంత ఇవ్వకపోతే అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా, కాన్పూర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆర్కే మిశ్రాకు ఫోన్ చేసి ఓ భవన నిర్మాణ సంస్థపై దాడులు చేయాల్సిందిగా కోరారు. వీరి తీరుపై అనుమానం వచ్చిన మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు