వైరల్‌ : గాల్లోనే తెరుచుకున్న విమానం కిటికీ

22 Apr, 2018 18:21 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం(ఏప్రిల్‌ 19) అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి 240 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురయింది. ఒక్కసారిగా విమాన కిటికీ తెరుచుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విమానం 15వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా విమాన కిటికీ ఒక్కసారిగా తెరుచుకుందని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స అందించామన్నారు. విమానంలో పది నిమిషాల పాటు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఎయిర్‌హోస్టెస్‌ కిటికీని యథాస్థానంలో ఉంచేందుకు ప్రయత్నించినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని డీజీసీఏ అధికారులు తెలిపారు. అయితే ఎయిర్‌ ఇండియా దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు