మసూద్‌ వ్యవహారం మా ఘనతే : జైట్లీ

2 May, 2019 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ను ప్రశంసించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ప్రధాని మోదీ అవిశ్రాంత కృషి, ఉగ్రవాదంపై రాజీలేని పోరుతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల వంటి పరిణామాల అనంతరం చైనా వైఖరిలో వచ్చిన మార్పులు కూడా సానుకూల ఫలితాలు ఇచ్చాయని చెప్పారు.

మసూద్‌ అజర్‌ వ్యవహారంలో విపక్షాల తీరును జైట్లీ తప్పుపట్టారు. దేశం విజయం సాధిస్తే అది భారతీయులందరి విజయంగా పరిగణించాలని అన్నారు. ఇది భారతీయులందరూ గర్వించదగిన పరిణామం అయితే, విపక్షంలో కొందరు ఈ దౌత్యవిజయంలో పాలుపంచుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటామని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు