పోలీసులు వేధించారంటూ టీవీ నటి ఫిర్యాదు

5 Jan, 2016 11:25 IST|Sakshi
పోలీసులు వేధించారంటూ టీవీ నటి ఫిర్యాదు

ముంబై: నలుగురు పోలీసులు తనను వేధించారంటూ ప్రవర్తించారని టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆరోపించింది. ముంబై శివారుప్రాంతం కండివాలిలోని తన ఇంట్లో ఈ ఘటన జరిగినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నలుగురు పోలీసులు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, కండివాలి పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా బెదిరించి వెళ్లిపోయారని ప్రత్యూష ఫిర్యాదులో పేర్కొంది. ప్రత్యూష పలు డైలీ సీరియల్స్లో నటిస్తోంది.

కాగా ప్రత్యూష ఆరోపణలను పోలీస్ అధికారి ఖండించారు. ప్రత్యూష ఇంట్లో ఉంటున్న రాహుల్ సింగ్ అనే వ్యక్తి కోసం పోలీసులు వెళ్లారని, అతనిపై అభియోగాలు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 31న రాహుల్.. అమిత్ దాల్వి అనే లోన్ రికవరీ ఏజెంట్పై చేయిచేసుకున్నారని చెప్పారు. ఆదివారం పోలీసులు దాల్వితో కలసి రాహుల్ కోసం ప్రత్యూష ఇంటికి వెళ్లారని, ఆ సమయంలో అతను ఇంట్లో లేడని చెప్పారు. పోలీసులు మరోసారి ప్రత్యూష ఇంటికి వెళ్లగా, రాహుల్ గోవాలో ఉన్నట్టు ఆమె తల్లి చెప్పారని పోలీసు అధికారి తెలిపారు. అంతేకాని నటి ప్రత్యూషతో పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదని వెల్లడించారు. ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిపారు.
 

మరిన్ని వార్తలు