వాద్రా పన్ను ఎగవేతలపై బీజేపీ ఫైర్‌

27 Jun, 2018 14:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ బీజేపీ విమర్శల దాడికి పదునుపెట్టింది. రాహుల్‌ బావ, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పన్ను ఎగవేతపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను డిమాండ్‌ చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిలను చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ రాబర్ట్‌ వాద్రాను ఆదేశించిందని బీజేపీ ప్రతినిధి సంబిట్‌ పాత్ర పేర్కొన్నారు. వాద్రా పన్ను ఎగవేతలపై రాహుల్‌ ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు.

2010-11 సంవత్సరానికి రాబర్ట్‌ వాద్రాకు చెందిన స్కై లైట్‌ హాస్పిటాలిటీనీ రూ 25.8 కోట్ల పన్ను బకాయిలను చెల్లించాలని ఐటీ శాఖ కోరినట్టు వార్తలు వచ్చిన క్రమంలో బీజేపీ రాహుల్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. సంబంధిత సంవత్సరానికి కంపెనీ ఆదాయం రూ 42.98 కోట్లు కాగా, కంపెనీ కేవలం రూ 36.9 లక్షలనే ఆదాయంగా చూపిందని ఐటీ వర్గాలు స్పష్టం చేశాయి. వాస్తవ ఆదాయంలో కేవలం 0.86 శాతాన్నేరాబడిగా చూపి కంపెనీ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ శాఖ విచారణలో నిగ్గు తేలింది. కాగా గతంలోనూ వాద్రా హర్యానా భూముల విషయంలో, పన్ను ఎగవేతలపై బీజేపీ గాంధీ కుటుంబం లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడింది. 

మరిన్ని వార్తలు