ప్రధాని మోదీని కలిసిన కుమారస్వామి

28 May, 2018 20:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం సాయంత్రం కలిశారు. కర్ణాటక సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీని కుమరస్వామి కలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే కేవలం మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిశానని కుమారస్వామి పేర్కొన్నారు. 

మోదీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కుమారస్వామి కలుసుకుని, కొత్త మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపు తదితర కీలక విషయాలపై చర్చించారు. సోనియా గాంధీ వైద్యపరీక్షలకోసం రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లడంతో వారిని కుమారస్వామి కలుసుకోలేకపోయారు . కాగా ఆదివారం మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ..రెండు మూడు రోజుల్లో మంత్రిపదవులను కేటాయిస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు హామి ఇచ్చారు. 

మరో వైపు కుమారస్వామి కాంగ్రెస్ పట్ల తనకున్న నిబద్దతను మరోసారి చాటుకున్నారు. కాంగ్రెస్‌ వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. ‘ స్పష్టమైన తీర్పు ఇవ్వాల్సిందిగా  ప్రజలను కోరాను, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వల్లే నేను ఇవాళ సీఎం పదవిలో ఉన్నాను.6 కోట్ల రాష్ట్ర ప్రజల తీర్పు వల్ల కాదు. ఇది నా స్వతంత్ర  ప్రభుత్వం కాదు. నన్ను సీఎం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలకు రుణపడి ఉంటాను' అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు