ఆవిష్కరణలకు నిధి!

17 Oct, 2017 03:20 IST|Sakshi

కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన

చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో సృజనాత్మక పరిష్కారాలు ఆవిష్కరించే వారిని ప్రోత్సహించేందుకు కార్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వం సంయుక్తంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సంయుక్త కృషితోనే సామాజిక సమస్యలకు పరిష్కారం సాధ్యమని అభిప్రాయపడ్డారు. సోమవారం చెన్నైలో ఇండియా ఇంటర్నే షనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ (ఐఐఎస్‌ఎఫ్‌) ముగింపు ఉత్సవాలకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని సూచించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు మన జీవన విధానాన్ని సమూలంగా మార్చేయబోతున్నాయని, ఈ ప్రగతిలో భారత్‌ ముందుం డాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. ప్రపంచంలో సైన్స్‌ అంతగా పురోగమించని కాలంలోనే భారత్‌ అంతరిక్ష, లోహాల తయారీ వంటి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని, మొఘలుల దాడి, పరాయి పాలనల కారణంగా మధ్య యుగాల్లో మనం ఆ స్థానాన్ని కోల్పోయామన్నారు. ఒకప్పుడు భారతదేశం లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే వని.. ఇప్పుడు ఈ పీడ ప్రపంచం మొత్తానికి విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మతం లేదని.. అది మానవాళి మొత్తానికి శత్రువు అని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలతో మమేకం కావాలి: సుజనా చౌదరి
కేంద్రం చేపట్టిన మేకిన్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌ వంటి పథకాలతో శాస్త్రవేత్తలు మమేకం కావాలని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరి కోరారు. యువత ఉద్యోగం ఆశిం చడం కాకుండా.. మరికొందరికి ఉద్యోగాలు కల్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సతీశ్‌ షెనాయ్‌ తదితరులు  పాల్గొన్నారు. 

సినిమాలకు ఫెలోషిప్‌లు: హర్షవర్ధన్‌
నవభారత నిర్మాణానికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలనే చోదకాలుగా చేసేందుకు ప్రధాని మోదీ నేతృ త్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే ఐఐఎస్‌ఎఫ్‌ను మూడేళ్లుగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి శాస్త్ర, పర్యావరణ అంశాలపై ప్రజల్లో చైతన్యాన్ని పెంచే చిత్రాలు, వీడియోలు, లఘు చిత్రాలు తీసేవారికి, కళాకారులకు ఫెలోషిప్‌లు అందజేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల్లో జరిగే ప్రయోగాలు, సామాజిక సమస్యల పరి ష్కారానికి చేసే ఆవిష్కరణలను ప్రజ లకు చేరవేసే విలేకరులను అవార్డులతో సత్కరిస్తామన్నారు. కాలుష్య రహిత టపాసులను తయారు చేయాల్సిందిగా శాస్త్రవేత్తలను కోరామని, సామాన్యులకు దీపావళి ఆనందం దూరం కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు