కక్షిదారులకు అర్థమయ్యేలా తీర్పులు

30 Jul, 2018 02:32 IST|Sakshi

సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: కోర్టులిచ్చే తీర్పులు సకారణంగా, కక్షిదారులకు అర్థమయ్యేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక కేసు కోర్టులో ఎందుకు ఓడిపోయిందో, లేక ఎందుకు గెలిచిందనే విషయం కక్షిదారులకు తెలిసేలా తీర్పులుండాలని సూచించింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పుపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండోర్‌ కాంపోజిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ 2005–06 కాలానికి గాను తమ సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ జమ చేయలేదు.

బాధితులు ఈపీఎఫ్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ను ఆశ్రయించగా వెంటనే రూ.87,204 చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాంపోజిట్‌ కంపెనీ ఈపీఎఫ్‌ ట్రిబ్యునల్‌లో సవాల్‌ చేసింది. పరిశీలించిన ట్రిబ్యునల్‌ బోర్డ్‌ ఆదేశాలను పక్కన బెట్టింది. దీంతో ట్రస్టీస్‌ బోర్డ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. పరిశీలించిన ఇండోర్‌ బెంచ్‌.. బోర్డ్‌ పిటిషన్‌ను కొట్టి వేయడంతోపాటు ట్రిబ్యునల్‌ ఆదేశాలను సమర్థించింది. ఈ తీర్పుపై ఈపీఎఫ్‌ బోర్డ్‌ సుప్రీంకు వెళ్లింది. విచా రణ చేపట్టిన జస్టిస్‌ ఏఎం సప్రే, జస్టిస్‌ నవీన్‌ సిన్హాల బెంచ్‌..  ‘ఆ తీర్పు కక్షిదారుల పట్ల పక్ష పాతం చూపినట్లుంది. కేసులో కక్షిదారులు తామెందుకు ఓడామో లేక గెలిచామనే విష యం తెలియకుండాపోయింది’ అని పేర్కొంది.

మరిన్ని వార్తలు